న్యూఢిల్లీ: భారత నౌకాదళంలోకి కొత్త యుద్ధనౌక వింధ్యాగిరి(INS Vindhyagiri) చేరనున్నది. ప్రాజెక్టు 17 ఆల్ఫా ఫ్రిగేట్స్లో భాగంగా దీన్ని రూపొందించారు. ఇండియన్ నేవీలో స్టీల్త్ షిప్గా ఇది సేవలు అందించనున్నది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దీన్ని ప్రారంభించనున్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేస్తోంది. ఆ యుద్ధ నౌక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఐఎన్ఎస్ నీలగిరి, ఉదయగిరి, హిమగిరి, తారాగిరి, దునగిరి లాంటి తరహాలోనే వింధ్యాగిరి పేరు పెట్టారు. కర్నాటకలో ఉన్న ఓ పర్వతశ్రేణి పేరే వింధ్యాగిరి. సాంకేతికంగా చాలా అడ్వాన్స్డ్ వర్షన్లో దీన్ని తయారు చేశారు. గతంలో ఉన్న ఐఎన్ఎస్ వింధ్యాగిరి దాదాపు 31 ఏళ్లు సేవలు అందించింది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లను, విన్యాసాలను ఆ యుద్ధ నౌక ఎదుర్కొన్నది.
కొత్తగా నిర్మితమైన వింధ్యాగిరి.. నౌకాదళ వారసత్వానికి ప్రతీకగా నిలువనున్నది. ప్రాజెక్టు 17ఏ ఫ్రిగేట్స్లో ఇది ఆరవ యుద్ధనౌక. ఈ వార్ షిప్లో స్టీల్త్ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఆయుధాలు కూడా ఉంటాయి. సెన్సార్లను కూడా ఆధునీకరించారు. ప్రాజెక్టు 17ఏ కింద ఉన్న నౌకలన్నింటినీ.. ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. యుద్ధ నౌకలను డిజైన్ చేయడంలో ఆ సంస్థ మేటి. స్వదేశీ సంస్థల నుంచే దాదాపు 75 శాతం ఇక్విప్మెంట్ ఆర్డర్లు వస్తున్నాయన్నారు.