అహ్మదాబాద్, ఆగస్టు 3: నవరాత్రి ఉత్సవాల సమయంలో నిర్వహించే గర్బా నృత్య ప్రదర్శనలపై జీఎస్టీ వర్తింపజేయాలని గుజరాత్లోని బీజేపీ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గర్బా ఎంట్రీ పాస్లపై 18 శాతం జీఎస్టీ విధించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గర్బా నృత్యం సమయంలో ధరించే ఛనియా చోలీ డ్రెస్పైనా 5 నుంచి 12 శాతం వరకు జీఎస్టీ విధించారు. డ్రెస్ ధర రూ.వెయ్యి కంటే తక్కువ ఉంటే 5%, ఎక్కువ ఉంటే 12% జీఎస్టీ వర్తిస్తుంది.
నవరాత్రుల ఉత్సవాల్లో గర్బా ప్రదర్శనలు
నవరాత్రుల ఉత్సవాల్లో ఔత్సాహికులు గర్బా నృత్య ప్రదర్శనల్లో పాల్గొంటారు. దీపం లేదా శక్తి దేవత చిత్రం లేదా విగ్రహం చుట్టూ గార్బా నృత్యం చేస్తారు. అలా చేస్తే ఏడాది పొడవునా అమ్మవారు శక్తి ప్రసాదిస్తారని విశ్వాసం. ఈవెంట్ నిర్వాహకులు కమర్షియల్గా నిర్వహించే గార్బా నృత్య ప్రదర్శనల ఎంట్రీపాస్లపై గుజరాత్ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి జీఎస్టీ వర్తింపచేయనున్నది. ఒక్క వడోదరలోనే లక్ష పాస్లు ఉంటాయి.18 శాతం జీఎస్టీ వల్ల గర్బా ప్రదర్శకులు అదనంగా కోటిన్నర రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్కోట్లో 50 వేల పాస్లకు గానూ అదనంగా రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంటుంది. భారీస్థాయిలో జీఎస్టీ విధింపు నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
వెనక్కి తీసుకోవాలి..
గర్బాపై పన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వడోదరలో జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సూరత్లోనూ ప్రజలు గర్బా ఆడుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా.. సీఎం భూపేంద్ర పటేల్కు లేఖ రాశారు. గర్బా అనేది గుజరాత్ సంస్కృతి, సంప్రదాయం అని, దీనిపై జీఎస్టీ వేయడం సరికాదని మండిపడ్డారు. మరోవైపు సూరత్లో నిర్వాహకులు సీజనల్ పాస్ స్థానంలో రోజువారీ పాస్లను ప్రవేశపెట్టారు. నవరాత్రి కాస్ట్యూమ్ డిజైనర్, అహ్మదాబాద్కు చెందిన హనీష్ పటేల్ మాట్లాడుతూ గర్బా నృత్యం గుజరాత్కు గుర్తింపు అని పేర్కొన్నారు.
స్వర్ణ దేవాలయంలోని విశ్రాంతి గదులపైనా జీఎస్టీ కొరడా!
స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో భక్తులు, పర్యాటకులు విశ్రాంతి తీసుకునే ప్రత్యేక గదులపైనా 12 శాతం జీఎస్టీని కేంద్రం విధించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (సీజీపీసీ) నిర్వహిస్తున్న బాబా దీప్ సింగ్ యాత్రి నివాస్, మాతా భాగ్ కౌర్ నివాస్, శ్రీ గురు గోబింద్ సింగ్ ఎన్ఆర్ఐ నివాస్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.