కేంద్రంతో అవి బరాబర్
జీఎస్టీ మండలి నిర్ణయాలు తప్పనిసరేం కాదు
రాష్ర్టాలు విడిగా సొంత చట్టాలు చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
జీఎస్టీని రుద్దడం సమాఖ్యస్ఫూర్తికి గొడ్డలిపెట్టు
కౌన్సిల్లో కేంద్రానికే మెజారిటీ ఉంటుంది
రాష్ర్టాల ప్రతిపాదనల ఆమోదం సాధ్యం కాదు
అది ఆర్థిక సమాఖ్యవాదానికిది దెబ్బ: సుప్రీం
రాష్ర్టాలకు స్వేచ్ఛనిచ్చిన తీర్పు
తాజా తీర్పు సానుకూల పరిణామం. జీఎస్టీ చట్టం సమాఖ్య ప్రయోజనాలకు భంగం కల్గించేదే. పన్నుల విషయమై రాష్ర్టాలకు స్వేచ్ఛనిస్తున్న ఈ తీర్పు సహకార సమాఖ్య విధానానికి లోబడి ఉన్నది.
–కేఎన్ బాలగోపాల్, కేరళ ఆర్థిక మంత్రి
ఆహ్వానించదగిన తీర్పు
పరిశ్రమ ఆహ్వానించదగిన తీర్పు ఇది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు.. కేవలం సిఫార్సులేనని కోర్టు సుస్పష్టంగా తెలిపింది. జీఎస్టీ పరిహారం కాలపరిమితి ఈ జూన్లో ముగియనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కీలకమైనది. కౌన్సిల్ నిర్ణయాలతో రాష్ర్టాలు ఏకీభవించని పలు అంశాల్లో విస్తృత పరిణామాలుంటాయి. -మహేశ్ జైసింగ్, డెలాయిట్ ఇండియా
న్యూఢిల్లీ, మే 19: జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎస్టీ మండలి ప్రతిపాదనల విషయంలో కేంద్రం, రాష్ర్టాలు పరస్పర అంగీకారయోగ్యంగా ఉండాల్సిందే తప్ప.. ఆమోదం తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. జీఎస్టీ కౌన్సిల్పై ఒక పిటిషన్పై విచారణ సందర్భంగా దేశంలో సమాఖ్య స్ఫూర్తి.. ఆర్థిక సమాఖ్య వాదంపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 246(ఏ) అధికరణం ప్రకారం జీఎస్టీపై సొంతంగా చట్టాలు చేసుకొనే అధికారాలు పార్లమెంట్కు, రాష్ర్టాల శాసనసభలకు సమానంగా ఉంటాయని పేర్కొన్నది. రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం పరస్పరం సహకార పూర్వకంగా జరిపిన చర్చల సారాంశంగా జీఎస్టీ ప్రతిపాదనలు ఉండాలని తెలిపింది. 279(బీ) అధికరణాన్ని తొలగించి, 279(1) కు చేర్చడం ద్వారా 2016లో చేసిన చట్ట సవరణ ద్వారా పార్లమెంట్ చెప్పింది కూడా ఇదేనని పేర్కొన్నది. 2017లో సముద్రంలో సరుకు రవాణాపై 5 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) విధిస్తూ కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను గుజరాత్ హైకోర్టు రద్దు చేసింది.
ఓడలో సరుకు రవాణాకు ఎలాంటి ఐజీఎస్టీ విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. గుజరాత్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 153 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించిన సుప్రీం ధర్మాసనం జీఎస్టీ మండలి సిఫార్సులను తప్పనిసరి చేయకపోతే ఆ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుందన్న వాదనను తోసిపుచ్చింది. జీఎస్టీ సిఫార్సులను తప్పనిసరి చేయాలని శాసనం చేస్తే.. అది ఆర్థిక సమాఖ్యస్ఫూర్తిని దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. జీఎస్టీపై కేంద్రానికి, రాష్ర్టాలకు చట్టాలు చేసుకొనేందుకు సమాన అధికారాలున్నాయని పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టు రూలింగ్పై కేంద్రం స్పందిస్తూ.. ఇది ‘ఒక దేశం.. ఒక పన్ను’ లక్ష్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. ప్రస్తుత చట్టం జీఎస్టీ ప్రతిపాదనలను ఆమోదించడానికి, తిరస్కరించడానికి రాష్ర్టాలకు అధికారాలిచ్చినా.. గత ఐదేండ్లలో ఏ రాష్ట్రమూ వినియోగించుకోలేదని తెలిపింది.
ఏకాభిప్రాయం ఉన్నా.. ఆమోదం లభించదు
జీఎస్టీ కౌన్సిల్లో జరిగే నిర్ణయ ప్రక్రియను కూడా కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. కౌన్సిల్లో ఒక ప్రతిపాదన ఆమోదం పొందాలంటే దానికి నాలుగింట మూడొంతుల మెజార్టీ లభించాలని గుర్తుచేసింది. అయితే, మొత్తం ఓటు షేరులో కేంద్రానికి మూడింట ఒక వంతు ఓట్లు ఉన్నాయని.. మిగిలిన రెండొంతుల ఓట్లు రాష్ర్టాలవేనని తెలిపింది. ఈ రాష్ర్టాల్లో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ప్రభుత్వాలు కూడా ఉంటాయని.. ఈ లెక్కన రాష్ర్టాలు కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొన్నప్పటికీ, కేంద్రం సహకారం లేకుండా ఆ నిర్ణయం ఆమోదం పొందడం సాధ్యం కాదని పేర్కొన్నది. దీనివల్ల రాష్ర్టాల ప్రతిపాదనలు ఎప్పటికీ చెల్లుబాటు కావని తెలిపింది. జీఎస్టీ చట్టాల అమలులో కేంద్రం, రాష్ర్టాల మధ్య భేదాభిప్రాయాలు వస్తే, మండలి సామరస్యపూర్వక వాతావరణంలో సరైన సలహాలు ఇవ్వాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది.
ప్రక్షాళన అవసరం
సుప్రీం తీర్పును ఆహ్వానిస్తున్నాం. జీఎస్టీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కౌన్సిల్కు కేవలం సిఫార్సులు చేసే అధికారం మాత్రమే ఉన్నదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సంబంధిత చట్ట సవరణలు చేసిన తర్వాతే కౌన్సిల్ నిర్ణయాల్ని అమలు చేసుకోవచ్చని సుప్రీం తెలిపింది.
–పళనివేల్ త్యాగరాజన్, తమిళనాడు ఆర్థిక మంత్రి
జీఎస్టీ వ్యవస్థపై ప్రభావం ఉండబోదు
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల అమలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ జీఎస్టీ వ్యవస్థను ప్రభావితం చేయబోదు. కౌన్సిల్ సిఫార్సుల్ని ఆమోదించే/తిరస్కరించే హక్కు ప్రస్తుత చట్టంలోనే రాష్ర్టాలకు ఉన్నది. అయినా గత ఐదేండ్లలో ఈ హక్కుని ఏ రాష్ట్రమూ ఉపయోగించుకోలేదు.
–తరుణ్ బజాజ్, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి