Vinod Kumar on Modi Govt | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలకడలేని విధానాలు, చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దీనివల్ల ప్రపంచ దేశాల ముంగిట భారత్ నవ్వులపాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు సరిపడా ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తామని నెల రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో జరిగిన వర్చువల్ భేటీలో ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ నెల రోజుల్లోనే ప్రపంచ దేశాలకు భారత్ నుంచి గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
రైతులెంత పంట పండిస్తున్నారు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు ఎంత అన్న అంశాలపై మోదీ సర్కార్కు ఏమాత్రం అవగాహన లేదని వినోద్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకి అని ఆరోపించారు. అన్నదాతల పట్ల ప్రధాని మోదీకి ఏమాత్రం ప్రేమాభిమానాలు లేవని ఈ చర్యలతో స్పష్టమైందన్నారు. ప్రధాని మోదీ సర్కార్కు వ్యవసాయం పట్ల కనీస అవగాహన లేదన్నారు.
రైతులను అన్ని విధాలుగా దగా చేయడమే ప్రధాని నరేంద్రమోదీ ఏకైక ఏజెండా అని వినోద్ కుమార్ విమర్శించారు. భారత్లో ప్రతియేటా సుమారు 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వస్తున్నదన్నారు. అందులో 50 శాతం దేశ ప్రజల అవసరాలు, ఆహార భద్రత కోసం నిల్వలు ఉంచుకుని మిగతా ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందన్నారు.
100 చిన్న దేశాలు తమ అవసరాల కోసం విదేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గోధుమల ఎగుమతి కోసం మొరాకో, ట్యునిషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా, లెబనాన్ తదితర దేశాలకు వాణిజ్యశాఖ అధికారుల బృందాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పంపారని గుర్తు చేశారు. ఇంతలోనే విదేశాలకు గోధుమల ఎగుమతిపై ప్రధాని మోదీ నిషేధం విధించారన్నారు. ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్న దేశాల వివరాలను తెప్పించుకుని భవిష్యత్లో ఆయా దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేయాలని సూచించారు.