RBI | న్యూఢిల్లీ, మే 21: రూ.2 వేల నోట్లను తమ బ్రాంచుల్లో మార్చుకొనేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు, ఫారం నింపాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఈ మేరకు అన్ని బ్రాంచ్లకు శనివారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. సంబంధిత ఫారం నింపకుండానే ఆర్బీఐ విధించిన పరిమితి మేరకు ఒక దఫాలో రూ.20 వేల(10 నోట్లు) వరకు మార్చుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకొనేందుకు లేదా మార్చుకొనేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆర్బీఐ సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు 2 వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు బ్యాంక్ సిబ్బంది నిరాకరిస్తే.. కస్టమర్లు సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 30 రోజుల్లోగా బ్యాంకు నుంచి స్పందన రాకుంటే లేదా వారిచ్చిన సమాధానం సంతృప్తిగా లేకుంటే, ఆర్బీఐ అంబుడ్స్మన్ను ఆశ్రయించవచ్చునని సూచించింది.
మోదీ సర్కార్ చేపట్టిన ‘రెండో నోట్ల రద్దు’ ప్రతికూల ప్రభావం ప్రారంభమైంది. ఓ ప్రయాణికుడు రూ.2 వేల నోటు ఇవ్వగా.. ఇది బ్యాన్ అయిందని, మరో నోటు ఇవ్వాలంటూ ఓ ఆటో డ్రైవర్ డిమాండ్ చేశాడు. ఇది వాగ్వివాదానికి దారితీయగా, ప్యాసెంజర్ను ఆటోడ్రైవర్ చితకబాదాడు. ఇద్దరి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా మోదీనగర్లో శనివారం చోటు చేసుకొన్నది. స్థానికులు సర్ది చెప్పి గొడవను ఆపినా.. 2 వేల నోటును తీసుకొనేందుకు ఆటోడ్రైవర్ ససేమిరా అన్నాడు. దీంతో ఆ ప్యాసెంజర్ తగిన డబ్బులు ఇచ్చి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఘజియాబాద్ జిల్లాల్లోని తురబ్నగర్లో రూ.2 వేల నోటుపై ఓ దుకాణాదారుడికి, వినియోగదారుడికి ఇదే విధంగా వాదన జరిగింది.