న్యూఢిల్లీ, డిసెంబర్ 3: చట్టాలను రద్దుచేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత దానిని ఎలా రద్దు చేస్తారని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్-2014 (ఎన్జాక్)ను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం 2015లో ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి తప్పుబట్టారు. ఢిల్లీలో శుక్రవారం డాక్టర్ ఎల్ఎం సింఘ్వీ 8వ స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధన్కర్తోపాటు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, మాజీ సీజేఐ జస్టిస్ ఆర్ఎం లోథా, కేంద్రమంత్రి పీయూష్గోయల్, మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. సింఘ్వీ స్మారకోపన్యాసం ఇచ్చిన ఉపరాష్ట్రపతి.. ఎన్జాక్ రద్దు తీర్పును తీవ్రంగా విమర్శించారు. ‘2015-16లో పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దానిని లోక్సభ, రాజ్యసభ ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా ఏకగ్రీవంగా ఆమోదించాయి.
విస్తృత ప్రజాభిప్రాయానికి ప్రతీక అయిన ఆ చట్టం రాజ్యాంగ నిబంధన అయ్యింది. కానీ, దానిని న్యాయస్థానం కొట్టేసింది. ఇలాంటి ఘటనను ప్రపంచం ఎన్నడూ చూడలేదు. మనలాంటి చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే చట్టాలు చేయకుంటే ఎలా? ఇలాంటి పరిణామాలు సమాజంలో విభజన రేఖలను గీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. ఇంకా ఆలస్యం కాలేదు. దీని గురించి అందరూ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ఒత్తిడికి గురిచేసే ఎత్తుగడలో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొలీజియం వ్యవస్థపై కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేయగా న్యాయవ్యవస్థ దానిపై అభ్యంతరాలు వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
భారత రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టు చేతిలో పెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 32, 226, 246 (3), 245, 251, 254, 372 (1), 137తోపాటు 131 నుంచి 136 వరకు న్యాయ సమీక్ష గురించి వివరిస్తాయి. ఈ ఆర్టికల్స్ ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులు వివిధ రకాల న్యాయ సమీక్ష అధికారాలు కలిగి ఉంటాయి. పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంటే.. దానిని రద్దుచేసే అధికారం ఆర్టికల్ 13 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్నది.
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని 1970లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దాదాపు అదే సమయంలో ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై నేర విచారణ చేపట్టే అవకాశం లేకుండా ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పుడు ఇందిర ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉన్నది కాబట్టి ఏ బిల్లులైనా చట్టాలుగా మారిపోయేవి. అంతమాత్రాన వాటిని దేశప్రజలందరు కోరుకొన్నారని అర్థం కాదు కదా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మోదీ సర్కారుకు పార్లమెంటులో బలం ఉన్నదన్న కారణంతో ఏ రకమైన చట్టాలైనా చేస్తామంటే కుదరదని స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలోనే నాటి ఉప ప్రధాని వల్లభ్భాయ్ పటేల్ న్యాయవ్యవస్థ ఔన్యత్యాన్ని గురించి చెప్పిన మాటలను గుర్తుచేస్తున్నారు. సుప్రీంకోర్టే లేకపోతే భారత రాజ్యాంగం ఏనాడో తన స్వరూపాన్ని కోల్పోయేదని గుర్తుచేస్తున్నారు. పార్లమెంటు ఆమోదించినంత మాత్రాన ఎన్జాక్ చట్టానికి దేశప్రజలందరి ఆమోదం ఉన్నదని ఎలా అంటారని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నారు.