Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలు, జాతీయవాదం, కాశ్మీర్ అంశాలు, హిందీ-సౌత్ సినీ పరిశ్రమలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘ధురంధర్’ మరియు ‘బారాముల్లా’ చిత్రాల గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.జాతీయవాదం ఉన్న సినిమాల గురించి ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ ముందుగా ‘ధురంధర్’ చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని ఆయన చెప్పారు. సినిమాలో చూపించిన ధైర్యమైన కథనం, దర్శకుడు తీసుకున్న విధానం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా సినిమా ట్రీట్మెంట్, మేకింగ్ స్టైల్ చాలా బాగుందని ప్రశంసించారు. అయితే అధికార బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ఇంకా ‘ధురంధర్ 2’ను పూర్తిగా చూడలేదని వెల్లడించారు.
పవన్ వ్యాఖ్యలతో ఆ సినిమా మరోసారి చర్చనీయాంశంగా మారింది. జాతీయవాద అంశాలను కొత్త కోణంలో చూపించిన ప్రయత్నాన్ని ఆయన అభినందించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడింది ‘బారాముల్లా’ సినిమా గురించే. ఈ చిత్రం తనకు చాలా నచ్చిందని, కథలోని అంశాలు వ్యక్తిగతంగా తనను ప్రభావితం చేశాయని చెప్పారు.తనకు హారర్ సినిమాలు చూడటం అలవాటు అని, రాత్రి నిద్ర పట్టని సందర్భాల్లో తరచూ హారర్ చిత్రాలు చూస్తానని పవన్ వెల్లడించారు. అలాంటి సమయంలోనే ‘బారాముల్లా’ సినిమా చూసినట్లు చెప్పారు. ఈ చిత్రంలో చూపించిన కాశ్మీర్ నేపథ్యం, అక్కడి పరిస్థితులు, ముఖ్యంగా కాశ్మీరీ పండితుల బాధలను దర్శకుడు ఎంతో ప్రభావవంతంగా చూపించారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలోని ప్రధాన అంశం కొత్తగా అనిపించిందని, అందుకే కథతో తాను బలంగా కనెక్ట్ అయ్యానని పేర్కొన్నారు.
సినిమాతో తనకు కనెక్షన్ ఏర్పడటానికి మరో కారణాన్ని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గతంలో సినిమా షూటింగ్ల కోసం కాశ్మీర్ వెళ్లినప్పుడు కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పారు. అక్కడ కొన్ని సందర్భాల్లో “ఇక్కడి నుంచి వెళ్లిపోండి” అనే పరిస్థితులను చూసానని, ఎవరైనా “గెట్ అవుట్” అని చెప్పడం తనకు అస్సలు నచ్చదని పేర్కొన్నారు. ఆ భావోద్వేగం కారణంగానే ‘బారాముల్లా’ సినిమాలోని సంఘటనలు తనను మరింతగా తాకాయని వివరించారు. బారాముల్లా’ చిత్రం సూపర్నేచురల్ హారర్ థ్రిల్లర్గా రూపొందింది. కాశ్మీర్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తీవ్రవాదం, కుటుంబ కథ, పోలీస్ దర్యాప్తు, ఆత్మల అంశాలు, కాశ్మీరీ పండితుల సమస్యలు వంటి పలు కోణాలను మిళితం చేశారు.దర్శకుడు ఆదిత్య సుహాస్ జంభలే తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ నిర్మించారు. గత ఏడాది నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.