Bharatiraja | తమిళ చిత్రసీమలో అత్యంత ప్రభావవంతమైన దర్శకులలో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతిరాజా బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 84 సంవత్సరాల వయస్సులో ఆయన కన్నుమూయడంతో తమిళంతో పాటు తెలుగు సినీ పరిశ్రమలు కూడా విషాదంలో మునిగిపోయాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతిరాజా పేరు వినగానే సహజత్వం, గ్రామీణ జీవనశైలి, మానవ భావోద్వేగాలు గుర్తుకు వస్తాయి. తమిళ సినిమాల్లో గ్రామీణ నేపథ్యంలో కథలను వాస్తవికంగా చూపించి ప్రత్యేక శైలిని సృష్టించిన దర్శకుడిగా ఆయనకు అపారమైన గుర్తింపు ఉంది.
దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లాసిక్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, ప్రేమ, కుటుంబ బంధాలు, సామాజిక అంశాలను తెరపై ఆవిష్కరించిన విధానం ఆయనను ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టింది.దర్శకుడిగానే కాకుండా నటుడు, రచయిత, నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేశారు. దక్షిణాది సినీ పరిశ్రమపై ఆయన ప్రభావం అపారమని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.సినీ రంగంలో దశాబ్దాల పాటు కొనసాగిన విజయవంతమైన కెరీర్తో భారతిరాజా గణనీయమైన ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.80 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.సినిమా నిర్మాణం, దర్శకత్వం, నటనతో పాటు ఇతర వ్యాపారాల ద్వారా కూడా ఆయన ఆర్థికంగా మంచి స్థాయిని సాధించినట్లు తెలుస్తోంది.
భారతిరాజా 1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు మనోజ్ భారతిరాజా, కుమార్తె జనని భారతిరాజా ఉన్నారు.తండ్రి అడుగుజాడల్లో నడిచిన మనోజ్ భారతిరాజా నటుడిగా, సహాయ దర్శకుడిగా, చిత్రనిర్మాతగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే 2025 మార్చిలో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం భారతిరాజా కుటుంబానికి పెద్ద విషాదంగా మారింది.45 ఏళ్ల వయసులో కుమారుడిని కోల్పోవడం భారతిరాజాను తీవ్రంగా కలచివేసిందని సన్నిహితులు చెబుతుంటారు. ఆ దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోలేకపోయిన ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించినట్లు సమాచారం.భారతిరాజా కుమార్తె జనని భారతిరాజా సినీ ప్రపంచానికి దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. మలేషియాకు చెందిన రాజ్కుమార్ తంబిరాజాను వివాహం చేసుకున్న ఆమె మీడియా, సినీ కార్యక్రమాల్లో చాలా అరుదుగానే కనిపిస్తుంటారు.