న్యూఢిల్లీ : పొరుగు దేశమైన శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరింది. ఇదే సమయంలో ఇంధన ధరలు, నిత్యావసర ధరలు భారీగా పెరిగడంతో పాటు సంక్షోభం ఏర్పడింది. అవసరమైన మందుల సరఫరాకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీలంక వ్యాప్తంగా ఆరోగ్య సేవలు భారీగా ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశానికి భారత్ అవసరమైన మందులను పంపి అండగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీలంక నేషనల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ తమ దేశానికి మందులు పంపినందుకు భారత్కు ధన్యవాదాలు తెలిపారు.
సకాలంలో సహాయం అందించడంతో ఆరోగ్య కేంద్రాల్లో సేవలకు ఇబ్బందులు తప్పాయన్నారు. జాతీయ కంటి ఆసుపత్రి డైరెక్టర్ దమ్మిక మాట్లాడుతూ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో నిత్యావసర మందుల లభ్యత కూడా తగ్గిందని, తద్వారా ఆరోగ్య సౌకర్యాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మాకు ఎంతో సాయం చేసిందని.. మందులు చాలా వరకు భారత్ నుంచి వస్తాయంటూ ధన్యవాదాలు తెలిపారు.