Sri Lanka Crisis | పొరుగుదేశంలో శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 19న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లంకలో నెలకొన్న పరిస్థితులపై విపక్షాలతో చర్చించనున్నది. శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు మరో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి శ్రీలంకలో పరిస్థితి, గతంలో ఆ దేశానికి భారత్ అందించిన సహాయంపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
పలు రాజకీయ పార్టీల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక సంక్షోభం, శరణార్థుల ప్రవేశంపై తమిళనాడులో ఆందోళన నెలకొన్నది. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్తో ఇటీవల జరిగిన సమావేశంలో శ్రీలంకలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న ఆ దేశానికి అవసరమైన సామగ్రి పంపేందుకు అనుమతి కోరారు. గత కొద్ది నెలలుగా శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.
ఆందోళనకారులు అధ్యక్షుడి భవనాన్ని ముట్టించగా.. ఆయన దేశం విడిచిపారిపోయారు. ఆ తర్వాత పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా పని చేసిన రణిల్ విక్రమసింఘే సైతం పదవికి రాజీనామా చేశారు. అనంతనం తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ బాధ్యతలు స్వీకరించారు. 225 మంది సభ్యులున్న పార్లమెంట్ ఈ నెల 20న ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నది. శ్రీలంక ప్రస్తుతం ఇంధనం, ఇతర నిత్యావసర సామగ్రి కొరతను ఎదుర్కొంటున్నది. ఇంధనం సరఫరా లేక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాల్సిన దుస్థితి నెలకొన్నది.