న్యూఢిల్లీ: స్పైస్జెట్ విమానం రాక ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులను గంటకుపైగా బోర్డింగ్ గేట్, ఏరోబ్రిడ్జి వద్ద నిలబెట్టారు. వారిని లాబీలోకి పంపించకపోగా వృద్ధులు తాగు నీరు అడిగినప్పటికీ ఆ సంస్థ సిబ్బంది స్పందించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 10న వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం టేకాఫ్ ఆలస్యమైంది. అయితే విమాన ప్రయాణికుల సెక్యూరిటీ తనిఖీ అప్పటికే పూర్తయ్యింది. దీంతో వారంతా బోర్డింగ్ గేట్, ఏరోబ్రిడ్జి వద్ద గంటకుపైగా ఉండాల్సి వచ్చింది.
కాగా, తిరిగి లాబీలోకి వెళ్లేందుకు అనుమతించాలని ప్రయాణికులు కోరినప్పటికీ స్పైస్జెట్ సిబ్బంది పట్టించుకోలేదు. వృద్ధులు తాగు నీరు అడిగినా ఇవ్వలేదు. విమానంలోకి ప్రవేశించిన తర్వాత వాటర్ బాటిల్ ఇస్తారని చెప్పారు. స్పైస్జెట్ సిబ్బంది చాలా సేపటి వరకు అక్కడ కనిపించలేదు. దీంతో బోర్డింగ్ గేట్, ఏరోబ్రిడ్జి వద్ద గంటకుపైగా వేచి ఉన్న విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన డీజీసీఏ ఈ సంఘటనపై స్పైస్జెట్ నుంచి గురువారం నివేదిక కోరింది.