ముంబై: భర్త తన తల్లితో కొంత సేపు గడపటం, ఆమెకు కొంత డబ్బు ఇవ్వడం తన భార్యను వేధించడం కిందకు రాదని ముంబై కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఆ భర్తపైన, ఆయన బంధువులపైనా గృహ హింస నుంచి మహిళల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, తనకు నష్టపరిహారం, తమ కుమార్తెకు పోషణ ఖర్చులు ఇప్పించాలని కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. పిటిషనర్ మహారాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఆమె 2015లో దాఖలు చేసిన పిటిషన్ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తన భర్త తరచూ ఆయన తల్లికి ఆర్థిక సాయం చేయడం, ఆమెతో కొంత సమయాన్ని గడుపుతుండటం వల్ల తమ మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు కోర్టుకు తెలిపారు. తమ వివాహానికి ముందు తన అత్తగారి మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి తనకు తెలియదని చెప్పారు. దీనివల్ల కుటుంబంలో ఉద్వేగాలు మరింత పెరిగాయన్నారు.