Tobacco | న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలంలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్ధాల వినియోగం బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్దమొత్తం వీటికి ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. అదే సమయంలో విద్యపై ఖర్చు తగ్గింది. 2022-23కి సంబంధిం చి గృహ వినియోగ వ్యయం సర్వే వివరాలను గత వారం విడుదల చేశారు. పాన్, పొగాకుపై ప్రజల ఖర్చు గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా పెరిగిందని సర్వే తెలిపింది.
2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగ వ్యయం 3.21 శాతం ఉండగా, 2022-23 నాటికి అది 3.79 శాతానికి పెరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1.63% నుంచి 2.43 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఈ కాలానికి విద్యపై పెట్టిన వ్యయం పట్టణ ప్రాంతాల్లో 6.9% నుంచి 5.78 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 3.49% నుంచి 3.30 శాతానికి తగ్గడం గమనార్హం.