జమ్ము, జూన్ 27: ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలన్న డిమాండ్ను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్ యంత్రాంగంపై ప్రత్యేక క్యాటగిరీ ఉద్యోగులు మండిపడుతున్నారు. దాదాపు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్ములో పండిట్లు, ఇతర హిందూ ఉద్యోగుల ఆందోళనలు సోమవారంతో 27వ రోజుకు చేరుకున్నాయి. తమ ప్రాణాలను బలిపెట్టొద్దని, కశ్మీర్ లోయ నుంచి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన రాహుల్ భట్కు నివాళిగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక కాలపరిమితితో సమగ్రమైన బదిలీ విధానం రూపొందించాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. కశ్మీర్లో విధులకు వెళ్లాలని ఒత్తిడి చేయొద్దని అధికార యంత్రాంగాన్ని అభ్యర్థించారు.