Jamili Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు, ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఐదేండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏమిటి చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతింటుంది. ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాలపరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది ప్రజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే’ అని వాళ్లు వాదిస్తున్నారు.
రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన కచ్చితత్వంతో లేదు. లోక్సభ విధివిధానాల్లోని 198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సిఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరుపడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపై 1999లో లా కమిషన్ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం.. జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే, ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి. ఈ రెండు తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్ను నియమిస్తారు. ప్రభుత్వాలు మారినా ఐదేండ్లపాటు సభ కొనసాగుతుంది. అయితే, జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉన్నది. మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు. అవిశ్వాస తీర్మానంతో రాష్ట్రప్రభుత్వాలు కూలిపోతే, జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూలేకపోలేదని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.