న్యూఢిల్లీ : బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లోక్సభలో శుక్రవారం చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై చర్చ సందర్భంగా కాషాయ పార్టీ ఎంపీ బీఎస్పీ సభ్యుడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను విపక్ష సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. డానిష్ అలీని విమర్శిస్తూ ఉగ్రవాది, తార్పుడుగాడు వంటి అభ్యంతరకర పదాలను రమేష్ బిధురి ఉపయోగించడం వివాదాస్పదమైంది. మరోవైపు బీజేపీ ఎంపీ ముస్లి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని సభలో రగడ జరగడంతో స్పీకర్ స్పందించారు. సహచర సభ్యుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై స్పీకర్ ఓంబిర్లా బీజేపీ సభ్యుడు రమేష్ బిధురిని హెచ్చరించారు.
ఇక బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బీఎస్పీ ఎంపీ అలీపై బిధురి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ లోక్సభలో విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను తాను వినలేదని, అయితే అవి విపక్ష సభ్యులకు ఇబ్బంది కలిగిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ సభ్యుడిపై చర్యలు చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుపట్టారు.
బిధురిపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను డిమాండ్ చేశారు. రమేష్ బిదురిపై ఏం చర్యలు చేపడతారో వెల్లడించాలని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ముస్లింలు, ఓబీసీలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని ఆమె ఆరోపించారు. బిధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విస్మయం వ్యక్తం చేశారు. బిధురిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు.
Read More :