చెన్నై, డిసెంబర్ 2: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కేంద్ర దర్యాప్తు సంస్థతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఓ వ్యక్తి తనను మూడు నెలలపాటు బెదిరించాడని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. శుక్రవారం మదురైలో లంచం తీసుకొంటుండగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి ఒకరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పీకర్ ఈ మేరకు స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ విధంగా తయారయ్యాయో ఇది సూచిస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతలు, బీజేపీయేతర పార్టీలను లక్ష్యంగా చేసుకొనేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరుకు ఇది సాక్ష్యమని అన్నారు.