న్యూఢిల్లీ, మార్చి 11: ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేందుకు ఒక్క ఓటు చాలు. తాజాగా ముగిసిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్లతో తేడాతో చాలా మంది అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. అభ్యర్థులతోపాటు పార్టీల భవితవ్యం కూడా మారిపోయింది. ఉదాహరణకు గోవాలో వెయ్యి లోపు మార్జిన్తో 10 మంది అభ్యర్థులు గెలిచారు. వీరిలో ఏడుగురు బీజేపీ అభ్యర్థులే. రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచిన మొత్తం సీట్లు 20. స్వల్ప తేడాతో గెలిచిన సీట్లలో కొద్దిగా తేడా వచ్చినా ఆ పార్టీ అధికారానికి దూరమయ్యే పరిస్థితి వచ్చేది.
యూపీలోనూ..
ఉత్తరప్రదేశ్లో బీజేపీ 255 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. 111 స్థానాలతో సమాజ్వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. సీట్ల సంఖ్య పరంగా చూస్తే ఎస్పీ కంటే బీజేపీ చాలా ముందంజలో ఉంది. కానీ మెజారిటీ స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఉంది. నలభైకి పైగా స్థానాల్లో ఈ రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 5వేల లోపే ఉంది. ఇందులో 30 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అంటే రాజకీయ సమీకరణల్లో కొద్దిగా తేడా వచ్చినా బీజేపీ సీట్లలో కొన్ని ఎస్పీ వశం అయ్యేవి. ముప్పైలో 20 సీట్లు ఎస్పీకి వచ్చేవి అనుకొన్నా.. ఆ పార్టీ సీట్లు 130కి పెరిగేవి. బీజేపీ సీట్లు 230కి పడిపోయేవి.
చీలిన ఓట్లు ఎస్పీవే
రాజకీయ సమీకరణల్లో మార్పులు జరిగితే ఎస్పీకి మేలు జరిగేదని చెప్పడానికి కారణం.. ఎస్పీ, బీజేపీ మధ్య పోటీ ఉన్న మెజారిటీ స్థానాల్లో బీఎస్పీ మూడో ప్లేసులో ఉన్నది. అంటే ఈ రెండు పార్టీల మధ్య ఓట్లను బీఎస్పీనే చీల్చిందన్నమాట. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ ఓట్లు చీలి బీఎస్పీకి పడే పరిస్థితి లేదు. ఒక వేళ ఈ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయకపోతే ఆ ఓట్లు బీజేపీకి కూడా పడేవి కాదు. అంటే ఎస్పీతో బీఎస్పీ పొత్తు పెట్టుకొన్నా, బీఎస్పీ పోటీ చేయకపోయినా ఈ స్థానాల్లో బీజేపీపై ఎస్పీ గెలిచే అవకాశాలే ఎక్కువ. ఉదాహరణకు ధామ్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థికి 81,791 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన ఎస్పీకి 81,588 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య తేడా 203 ఓట్లు మాత్రమే. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థికి 38,993 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీఎస్పీ బరిలో లేకపోతే ఈ 38వేలల్లో మెజారిటీ ఓట్లు ఎస్పీకే పడేవి. కుర్సీ, నేహతౌర్, బిలాస్పూర్.. ఇలా చాలా నియోజకవర్గాల్లో ఇలాగే జరిగింది. ఎస్పీ విజయావకాశాలను బీఎస్పీ దెబ్బతీసింది.
ఉత్తరాఖండ్లోనూ అంతే
ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీజేపీ మధ్య ఉన్న పరిస్థితే ఉత్తరాఖండ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్నది. ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 70. 24 స్థానాల్లో అభ్యర్థుల మధ్య మెజారిటీ 5 వేల కంటే తక్కువుంది. అందులో 20 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. 14 స్థానాల్లో బీజేపీ గెలిచింది. శ్రీనగర్ స్థానంలో బీజేపీకి 29,618 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 29,031 ఓట్లు వచ్చాయి. తేడా 587 మాత్రమే.