లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వచ్చేది మా ప్రభుత్వమేనని..తమను అణిచివేసిన వారు ఈ విషయం గుర్తెరగాలంటూ వ్యాఖ్యానించిన ఎస్పీ అభ్యర్ధి ప్రసంగానికి సంబంధించిన వైరల్ వీడియోపై పోలీసులు చర్యలు చేపట్టారు. బెదిరింపు వ్యాఖ్యలు చేసిన మీరట్ సౌత్ ఎస్పీ అభ్యర్ధి అధిల్ చౌధరిపై కేసు నమోదు చేశామని మీరట్ ఎస్పీ వినీత్ భట్నాగర్ పేర్కొన్నారు. ఎస్పీ అభ్యర్ధి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ప్రాధమిక దర్యాప్తులో తెలిసిందని తెలిపారు.
అధిల్ చౌధరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపింది. ఎస్పీ నేత అధిర్పై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున ఐపీసీ 505 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని మీరట్ ఎస్పీ తెలిపారు. నౌచంది ప్రాంతంలో జరిగిన ఓ సభలో అధిల్ చౌధరి మాట్లాడుతూ యూపీలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, తమను అణిచివేస్తున్న వారిపై అప్పుడు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ఆవేశంగా చెబుతుండటం వీడియోలో కనిపించింది.
తమను వేధిస్తున్న వారిని అంతకంతకూ బదులు తీర్చుకుంటామని తమను హింసించే ముందు వారు 100 సార్లు ఆలోచించుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్ను ఉద్దేశించి ఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపటంతో ఎస్పీ నేత వెనక్కి తగ్గారు. బీజేపీపై తాను కాదని ప్రజలే ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.