న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు(Southwest Monsoon) తిరోగమన బాట పట్టినట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి రుతుపవనాల తగ్గుముఖంపట్టాయని ఐఎండీ వెల్లడించింది. అయితే ఈ వర్షాకాల సీజన్లో .. ఢిల్లీలో సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలోనే వర్షాలు పడినట్లు ఐఎండీ పేర్కొన్నది. ఢిల్లీలో ఉన్న వెదర్ స్టేషన్.. సఫ్దార్జంగ్ అబ్జర్వేటరీ ప్రకారం .. ఈసారి వర్షాకాలంలో 660.8 వర్షం నమోదు అయ్యింది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ సీజన్లో 653.6 ఎంఎం ఉంటుందని ఐఎండీ తెలిపింది.
ఐఎండీ ప్రకారం.. ప్రతి ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఢిల్లీలో వర్షాకాలం మొదలువుతంది. ఇక సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతాయి. అయితే ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచే నగరంలో వర్షాలు పడినట్లు ఢిల్లీ వెదర్ శాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, వెస్ట్ యూపీ, వెస్ట్ మధ్యప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, వెస్ట్ రాజస్థాన్ నుంచి కూడా రుతుపవనాలు తిరుగుబాట పట్టాయని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. మరికొన్ని రోజుల్లో రాజస్థాన్, గుజరాత్ నుంచి రుతుపవనాలు వెళ్లిపోనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.