న్యూఢిల్లీ/ హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పటికీ కనీసం మరో వారం రోజులపాటు విస్తృతమైన వర్షపాతం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. జూన్ 23 ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభమయ్యే వరకు వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. భారత్లోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో రుతుపవనాల కదలిక సాంకేతికంగా కొనసాగుతున్నప్పటికీ వర్షాలను కురిపించే ఆ వ్యవస్థ అసాధారణంగా బలహీనంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జూన్ 21 మధ్య రుతు పవనాల కార్యకలాపాలు పెద్దగా చురుకుగా ఉండకపోవచ్చని అంచనా. దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పడిన వర్షపాత లోటు మరింత కొనసాగే అవకాశం ఉంది.
రానున్న వారంలో విస్తృతమైన రుతుపవన వర్షాలకు బదులుగా ప్రధానంగా దక్షిణ భారతదేశంలో స్థానిక ఉరుములతో కూడిన వర్షాల ద్వారానే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు, అలాగే తూర్పు కనుమల్లో తరచుగా ఉరుములతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, మెరుపులు, బలమైన గాలులు సంభవించే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 9-10 రాష్ర్టాలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని.. ఆ రాష్ర్టాల్లోని జిల్లా అధికారులు, వ్యవసాయ సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల కోసం ముందస్తు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయటం, పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచటం, రైతులకు శాస్త్రీయ సలహాలు అందేలా చూడటంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఖరీఫ్ 2026 సన్నాహకాలపై మంగళవారం సమీక్ష సమావేశానికి కేంద్ర మంత్రి చౌహాన్ అధ్యక్షత వహించారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.