న్యూఢిల్లీ, జూన్ 9: రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఆ పార్టీ కీలక నేత జితిన్ ప్రసాద పార్టీని వీడారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీని పునర్వ్యవస్థీకరించాలని, అన్నిస్థాయిల్లో ఎన్నికలు నిర్వహించాలి అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 24 మంది రెబల్ నేతల్లో జితిన్ ప్రసాద కూడా ఒకరు. కేంద్ర మాజీ మంత్రి అయిన జితిన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. యూపీలో బీజేపీపై బ్రాహ్మణవర్గం అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో జితిన్ రాక పార్టీకి బలం చేకూరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాల్ కాంగ్రెస్కు ఇన్చార్జిగా వ్యవహరించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆయనకు చోటు దక్కనుందని వార్తలు వెలువడుతున్నాయి.
సచిన్ పైలట్ ఓపికగా ఉండాలి: కాంగ్రెస్
జితిన్ ప్రసాద బీజేపీలో చేరడంతో సచిన్ పైలట్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగురవేసినప్పుడు పార్టీ ఆయనకు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో జితిన్ బీజేపీలో చేరిన వెంటనే పార్టీ సచిన్కు ఓ సందేశం పంపింది. ‘దశ తిరిగే సమయం తప్పకుండా వస్తుంది. సచిల్ పైలట్ ఓపికగా ఉండాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా వ్యాఖ్యానించారు.