న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ( CJI Ramana ) పార్లమెంట్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. ఒకప్పుడు సభలో మొత్తం లాయర్లే ఉన్న సమయంలో పార్లమెంట్ ఎంతో హుందాగా నడిచేదని సీజేఐ అనడం గమనార్హం. అందుకే న్యాయ వ్యవస్థలోని వాళ్లు ప్రజాసేవపైనా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్ పనితీరు తీవ్ర నిరాశజనకంగా ఉన్నదని, అసలు సరైన చర్చే జరగడం లేదని విమర్శించారు. చట్టాలపై స్పష్టత లేదు. అసలు చట్టం ప్రయోజనం ఏంటో తెలియదు. ఇది ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోంది. లాయర్లు, మేధావులు సభలో లేనప్పుడు ఇలాగే జరుగుతుంది అని రమణ అనడం గమనార్హం.
స్వాతంత్ర్య సమరయోధులను చూడండి. వాళ్లలో చాలా మంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్లే. మొదటి లోక్సభ, రాజ్యసభలో మొత్తం లాయర్లే ఉన్నారు అని ఎన్వీ రమణ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం. అప్పట్లో సభల్లో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగేవి. ఆర్థిక బిల్లులపై చర్చలు జరిగేవి. ఎంతో నిర్మాణాత్మక అంశాలను లేవనెత్తేవాళ్లు. చట్టాలను చర్చించేవాళ్లు. ప్రతి ఒక్కరికీ చట్టంలోని శాసన వ్యవస్థపై అందరికీ స్పష్టత ఉండేది అని ఎన్వీ రమణ అన్నారు.
అందుకే లాయర్లకు నేను ఒకటే చెబుతున్నాను. మీరు కేవలం న్యాయ సేవలకే పరిమితం కావద్దు. ప్రజా సేవ కూడా చేయండి. మీ జ్ఞానాన్ని, తెలివిని దేశం కోసం ఉపయోగించండి అని సీజేఐ రమణ పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన మనం సాధించిన విజయాలు, విధానాలను పునఃసమీక్షించుకోవాలని ఆయన అన్నారు. మన సంతృప్త స్థాయులు పతనం అంచుకు చేరాయి. మా చిన్నతనంలో ఇండిపెండెన్స్ డే నాడు చిన్న బెల్లం ముక్క, జెండా ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతో ఉన్నా.. మనం సంతోషంగా లేము అని రమణ అనడం గమనార్హం.