చెన్నై: ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతున్న మహిళా డ్రైవర్ను (TN woman bus driver) ఒక ఎంపీ సత్కరించారు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ మహిళా డ్రైవర్ను విధుల నుంచి తొలగించారు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల షర్మిల ఒక ప్రైవేట్ బస్సులో డ్రైవర్గా పని చేస్తున్నది. ప్రముఖుల నుంచి ప్రశంసలను కూడా ఆమె అందుకున్నది. కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ ఇటీవల షర్మిల డ్రైవ్ చేసిన ఆ ప్రైవేట్ బస్సులో ప్రయాణించారు. తాజాగా డీఎంకే ఎంపీ, ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి కూడా గాంధీపురం నుంచి పీలమేడు వరకు షర్మిల నడిపి బస్సులో శుక్రవారం ప్రయాణించారు. అనంతరం ఆ యువతి డ్రైవింగ్ నైపుణ్యాన్ని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ అయిన తండ్రి సమక్షంలో షర్మిలను ఎంపీ కనిమొళి సత్కరించారు. చేతి వాచీని ఆమెకు బహుకరించారు.
కాగా, ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఉద్యోగం నుంచి తనను తొలగించారని మహిళా బస్సు డ్రైవర్ షర్మిల ఆరోపించింది. ఎంపీ కనిమొళి బస్సులో ప్రయాణించిన సందర్భంగా ఆమె పట్ల ఒక మహిళ దురుసుగా ప్రవర్తించగా అడ్డుకోని కండక్టర్పై బస్సు యజమానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే సొంత పబ్లిసిటీ కోసం ప్రముఖ వ్యక్తులను బస్సులోకి ఎక్కిస్తున్నట్లు యజమాని తనను తిట్టినట్లు చెప్పింది. అలాగే ఉద్యోగం నుంచి వెళ్లిపొమ్మని చెప్పారని, బస్సు మేనేజర్ కూడా తన తండ్రి పట్ల అసభ్యంగా మాట్లడినట్లు షర్మిల ఆరోపించింది. మరోవైపు షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వచ్చిన వార్తలను ప్రైవేట్ బస్సు యాజమాన్యం ఖండించింది.
Watch Video:
https://embed.indiatoday.in/share/video/embed/7364