Messiah Sonu sood | కరోనా వ్యాప్తి సమయంలో ఎందరో పేదలకు అండగా నిలిచి నటుడు సోనూ సూద్ మెస్సయ్యగా నిలిచారు. ప్రస్తుతం మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ఈసారి ఆస్టియో ఆర్ధరైటిస్తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు సోనూ సూద్ ముందుకొచ్చారు. ‘ఐ ప్లెడ్జ్ ఫ్రీ నీ ఇంప్లాంట్స్ # కదమ్ బడాయేజా’ పేరుతో మోకాలు నొప్పులతో బాధపడుతున్నవారికి అండగా నిలవనున్నట్లు ప్రకటించారు.
నటుడు సోనూసూద్ మరోసారి పేదలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్వచ్ఛంద సంస్థ ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మోకాలి చిప్పల వ్యాధితో బాధపడుతున్న వారికి సాయం చేయడానికి ‘కదమ్ బడాయే జా’ ప్రచారాన్ని ప్రారంభించారు. దీని కింద ఆయన ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్న రోగులకు చికిత్స పొందడానికి సహాయం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 50 ఏండ్ల తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి చాలా సాధారణం అవనున్నదని విచారం వ్యక్తం చేశారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో నొప్పి నుంచి రోగికి ఉపశమనం కలిగించేందుకు మొత్తం మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. అయితే, ఇది ప్రజలందరూ భరించలేనిదని, అందుకే సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా అటువంటి పేద రోగులకు సాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.
పిల్లలకు నడక నేర్పిన వారు.. ఇప్పుడు నడవడానికి ఇబ్బందిపడటాన్ని చూస్తుంటే బాధ కలుగుతుందని సోనూ సూద్ చెప్పారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఈ సమాజం ఎందుకు ఆలోచించదో అర్థం కావడం లేదన్నారు. తన ఫౌండేషన్ ద్వారా చేపట్టే ఈ ఛారిటీతో ఈ గ్యాప్ను కొంతమేర తగ్గించాలనుకుంటున్నాను అని చెప్పారు. అవసరమైన వృద్ధులకు ఉచితంగా మోకాలి చిప్ప సర్జరీలు చేయిస్తానని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లు అన్నీ ముంబైలో జరిగేందుకు ఏర్పాట్లు చేయించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు soodcharityfoundation.org వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన సూచించారు.