వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఏ పదవి ఇవ్వాలన్న దానిపైనే అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోందట. ఇప్పటికే పార్టీ సీనియర్లు ఆయనకు పదవి ఇచ్చే విషయంలో చాలా సీరియస్గానే మంతనాలు జరిపారు. చివరికి పాలుపోకపోవడంతో ఆ విషయాన్ని సోనియా కోర్టులోకి నెట్టేశారు. దీంతో ఇప్పుడు పీకే పదవి అనే బంతి సోనియా కోర్టులోనే వుంది. ఈ విషయాన్ని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. పీకేకు ఏ పదవి ఇవ్వాలన్నది పార్టీ అధినేత్రి సోనియా ఇష్టమని, ఆమే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
4 గంటలుగా ఈ అంశంపైనే మంతనాలు
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాతో మరోమారు భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పోల్స్ గురించి అని బయటికి వచ్చినా, అసలు విషయం పీకేకు ఏ పదవి ఇవ్వాలన్న దానిపైనే చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంకతో ఇదే విషయంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. పీకేకు పదవి ఇచ్చే విషయంలో సోనియాదే అంతిమ నిర్ణయం. మేము సోనియాపైనే పెట్టేశాం. అధ్యక్షురాలు సోనియా పలుమార్లు చర్చలు జరిపారు. సీనియర్లతో కూడా చర్చిస్తున్నారు. ఇది పూర్తి కావడమే తరువాయి.. ఆయన పార్టీ కండువా కప్పేసుకుంటారు అని సీనియర్ నేత ఒకరు తెలిపారు.