న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే ఇంటికి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనను ఆమె అభినందించారు. అయితే దీనికి ముందు కొంత హైడ్రామా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే తొలుత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదు. అనంతరం సోనియా గాంధీనే స్వయంగా కారులో మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందడంపై అభినందించారు.
అయితే మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఇంటికి తప్ప ఏ కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లని సోనియా గాంధీ, స్వయంగా ఖర్గే నివాసానికి వెళ్లడం పార్టీ నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని, అంతా ఆయన మాట వినాల్సిందే అన్న సందేశాన్ని క్యాడర్కు పంపేందుకే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తున్నది.
మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున ఖర్గే ఎన్నిక పట్ల ఇలాగే స్పందించారు. ‘కొత్త అధ్యక్షుడి కింద పనిచేస్తా. పార్టీలో నా పాత్రను ఆయన నిర్ణయిస్తారు’ అని మీడియాతో అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తమ కుటుంబం దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు.