న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకాలేదు. గత వారం ఆమె కరోనా బారిన పడ్డారు. దాని నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు మూడు వారాల గడువు కోరారు. దీంతో ఈడీ ఆమెకు మరోసారి సమన్లు జారీ చేయనున్నది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. జూన్ 8న తమ కార్యాలయానికి రావాలంటూ సోనియా గాంధీకి, జూన్ 13న హాజరు కావాలని రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద వారిద్దరిని ఈడీ ప్రశ్నించనున్నది.
మరోవైపు జూన్ 2న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె చికిత్స పొందుతున్నారు. బుధవారం ఈడీ కార్యాలయానికి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో తన హాజరుకు మూడు వారాల సమయం కోరారు. మరోవైపు ఈ నెల 13న ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ హాజరవుతారని తెలుస్తున్నది.
కాగా, ఈడీ నుంచి తప్పించుకునేందుకు సోనియా, రాహుల్ ప్రయత్నించడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. కాంగ్రెస్ చట్టానికి కట్టుబడి ఉండే పార్టీ అని చెప్పారు. 2002 నుంచి 2013 వరకు అమిత్ షా పరుగులు తీసిన మాదిరిగా తమ పార్టీ అధినేతలు వ్యవహరించరని అన్నారు.