న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం ఇదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. మహమ్మారి కట్టడికి జాతీయ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయం కూడగట్టాలని ఆమె కోరారు. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాజకీయ ఏకాభిప్రాయం సాధించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని శనివారం విడుదల చేసిన వీడియో సందేశంలో సోనియా పేర్కొన్నారు. దేశ పౌరులందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేపట్టాలని కోరారు.
ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పేదల ఖాతాల్లో రూ 6000 జమ చేయాలని సూచించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు ప్రాణాధార మందుల బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకోవాలని కోరారు. ఈ సంక్షోభ సమయంలో మహమ్మారి కట్టడికి ప్రభుత్వంతో సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. కరోనాపై పోరాటంలో దేశ ప్రజలంతా కలిసికట్టుగా వ్యవహరించాలని ఆమె పిలుపు ఇచ్చారు.