ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. ఇందులో సంస్థాగతంగా అనేక మార్పు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ అధికారికంగానే ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ రూట్ మ్యాప్ను రూపొందిస్తున్నారు. హిందుత్వ కార్డు, రిజర్వేషన్లు… ఇలా అనేక విషయాలపై తమ విధానాన్ని మరింత నొక్కి చెప్పి, ఎన్నికల వేళ ప్రజలను తమ వైపు తిప్పుకోడానికి ప్రయత్నాలు చేయనున్నారు. తాజాగా… మరో అంశం కూడా తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్ టిక్కెట్పై గెలిచి, వెంటనే పార్టీ మారిపోయే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ అంశంతోనే కాంగ్రెస్ బలహీన పడుతూ వస్తోందని అధిష్ఠానం గుర్తించింది. ఇప్పుడు దీనికి అడ్డుకట్ట వేయాలని సోనియా నిర్ణయించారు. మామూలుగా చెబితే నేతలు వినేట్టు లేరని అనుకున్నారో ఏమో గానీ.. సోనియా సెంటిమెంటల్గా కొట్టాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్ టిక్కెట్పై గెలిచిన తర్వాత… ఇక కాంగ్రెస్ను వీడనని అందరి నాయకుల చేత ఒట్టు పెట్టించే కార్యక్రమానికి సోనియా గాంధీ శ్రీకారం చుట్టనున్నారట. అలాగే కాంగ్రెస్లో ఉన్న నేతలతో కూడా ఒట్టు పెట్టించే కొత్త కార్యక్రమానికి సోనియా తెర లేపనున్నారు. కాంగ్రెస్లోనే ఉంటా. ఒట్టు. పార్టీని వీడను. అలాగే నా అనుచరులు కూడా పార్టీని వీడకుండా చూస్తా. అన్న ఒట్టు పెట్టించాలని సోనియా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ విధానాన్ని ఉదయ్పూర్ వేదికగా సోనియా ప్రకటించనున్నారు.
రైల్లోనే ఉదయ్పూర్ వెళ్లనున్న రాహుల్
అధిష్ఠానానికి, కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోనియాకు నివేదించిన రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పుడు దీనిని పూరించే ప్రక్రియను కాంగ్రెస్ చేపట్టింది. ఉదయ్ పూర్ వేదికగా జరిగే చింతన్శిబిర్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రైల్లోనే వెళ్లనున్నారు. మిగతా అందరి నేతలతో కలిసి, ట్రైన్లో వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇలా వెళ్లడం ద్వారా హైకమాండ్ నేరుగా తమతో టచ్లోనే వుందన్న ఫీలింగ్ ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇక.. సోనియా, ప్రియాంక మాత్రం విమానంలోనే వెళ్తారు.