ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్నిప్రతిపక్ష పార్టీలతో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా.. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలన్న లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ప్రాథమిక చర్చలను సోనియా గాంధీ ఇప్పటికే పూర్తి చేసేశారు. అయితే గతంలోనూ సోనియా ఆధ్వర్యంలో ఓ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తృణమూల్ అధినేత్రి మమతను ఆహ్వానించలేదు.
అయితే ఈ సారి మాత్రం మమతను కూడా ఆహ్వానించనున్నారు. గతంలో రెండు మార్లు ప్రతిపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఈ రెండు సార్లూ అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఆహ్వానించాం. ఈ సారి కూడా అలాగే అన్ని ప్రతిపక్ష పార్టీలనూ ఆహ్వానిస్తాం. అని ఓ కీలక నేత ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి సీపీఎం వెనక నుంచి కీలకమైన మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. చాలా పార్టీలు ఎన్నికల్లో బిజీగా ఉన్నాయని, అందుకే ఫలితాల తర్వాతే ఈ కీలక సమావేశం జరుగుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రకటించారు.
గతేడాది ఆగస్టులో అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనికి 19 పార్టీలు హాజరయ్యాయి. దేశ భవిష్యత్తు దృష్ట్యా వ్యక్తిగత అవసరాలన్నింటినీ పక్కనపెట్టి, కలిసి రావాలని సోనియా పిలుపునిచ్చారు. అంతేకాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓ రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకుందాని సోనియా ఈ సమావేశంలో సూచించారు.