న్యూఢిల్లీ : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్పై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టిసారించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం హిమాచల్ ప్రదేశ్ నేతలతో పార్టీ పరిస్ధితిని సమీక్షించారు. పంజాబ్ తరహా అంతర్గత కుమ్ములాటలకు చోటు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాజీవ్ శుక్లా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్లో విజయానికి అనుసరించాల్సిన రోడ్మ్యాప్పై నేతలు చర్చించారు.
హిమాచల్లో ఆప్ బలాబలాలను ఈ సందర్భంగా నేతలు సోనియాకు వివరించారు. హిమాచల్ ప్రదేశ్లో ఆప్ ప్రభావం పెద్దగా లేదని బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు లభించని వారే ఆప్ నుంచి బరిలో దిగే అవకాశం ఉందని శుక్లా పేర్కొన్నారు. ప్రత్యర్ధి పార్టీలపై పైచేయి సాధించేందుకు అవసరమైన ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేయాలని సోనియా పార్టీ నేతలను కోరారు. తామంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి చొరవ చూపుతామని, విభేదాలతో కీచులాటలకు దిగబోమని నేతలు సోనియాకు హామీ ఇచ్చారు.
కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదయోగ్యమేనని వారు స్పష్టం చేశారు. ఇక గత ఏడాది హిమాచల్ప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. మండి లోక్సభ స్ధానంలో విజయం సాధించిన ఆ పార్టీ మూడు అసెంబ్లీ స్ధానాలనూ కైవసం చేసుకుంది. ఇదే ఊపుతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.