నాగాలాండ్ కాల్పుల విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో అధికార బీజేపీని ఎలాగైనా ఇరుకున పెట్టాలని, పార్లమెంట్ సమావేశాల్లో నిలదీయాలని కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. అయితే నాగాలాండ్ లో కాల్పుల తర్వాత నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ బృందాన్ని నియమించింది. ఇందులో నలుగురు సభ్యులుగా ఉంటారు.
ఆంటో ఆంటోనీ, జింతేంద్ర సింగ్, అజయ్ కుమార్, గౌరవ్ గొగోయ్ సభ్యులుగా ఉన్నారు. వీరు నాగాలాండ్లో కాల్పులు జరిగిన ప్రదేశంలో పర్యటించి, వారం రోజుల్లోగా సోనియా గాంధీకి ఓ రిపోర్టు సమర్పిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కాల్పుల్లో మరణించిన పౌరుల అంతిమ సంస్కారాలకు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఫేస్బుక్ వేదికగా తెలిపారు.
ఇక, నాగాలాండ్ కాల్పుల విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన ప్రకటనపై రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏ చేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కేంద్రానికి సమాచారం ఇచ్చేవారు ఏం చేస్తున్నారు? ఈ విషయాలన్నీ కేంద్ర హోంమంత్రికి తెలిసుండాలి కదా.. అంటూ ఖర్గే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ విషయాలన్నింటిపై సభలో కేంద్రాన్ని నిలదీద్దామని భావిస్తే, సభను వాయిదా వేశారని ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు.