న్యూఢిల్లీ, జూలై 21: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. గురువారం సోనియా తన కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకతో కలిసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత సోనియా, ప్రియాంక కార్యాలయం లోపలికి వెళ్లారు. ఇటీవల సోనియాకు కరోనా సోకిన నేపథ్యంలో ఆమెకు తోడుగా ఉండటానికి ప్రియాంకను అధికారులు అనుమతించారు. అయితే సోనియాను విచారించేటప్పుడు ప్రియాంకను పక్క గదిలో ఉంచారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఆర్థిక అవకతవకలపై సోనియాను దాదాపు రెండు గంటలపాటు అధికారులు ప్రశ్నించారు.