Sonam Wangchuk : విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ స్థానిక యువతను రెచ్చగొట్టి, దేశాన్ని హింసాత్మకంగా మార్చాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోనమ్ వాంగ్ చుక్ను నిర్బంధించడంపై కేంద్రం సుప్రీంకోర్టులో తన వాదన వినిపించింది. ఆయనను నిర్బంధంలో ఉంచడాన్ని కేంద్రం సమర్ధించుకుంది. లధాక్ ప్రాంతానికి చెందిన వాంగ్చుక్ కొంతకాలంగా సభలు, సందేశాల ద్వారా అక్కడి యువతను రెచ్చగొడుతున్నాడు.
భారత్, చైనా సరిహద్దులో ఉన్న లధాక్ ప్రాంతం దేశ రక్షణకు ఎంత కీలకమో తెలిసిందే. చైనా దాడులు వంటి అంశాల వల్ల అక్కడి పరిస్తితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సోనమ్ వాంగ్ చుక్ అంటున్నారు. ఏ ప్రాంతానికైనా ఎవరితో కలిసుండాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని, అందుకోసం స్థానిక ప్రజలతో ప్రజాభిప్రాయసేకరణ చేయాలని, రెఫరెండం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక యువతను రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను నిర్బంధించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వాంగ్ చుక్ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
దేశంపై వాంగ్ చుక్ విషం కక్కడాన్ని సమర్ధించబోమన్నారు. సున్నిత ప్రాంతమైన లధాక్ దేశ రక్షణకు చాలా కీలకం అని, అలాంటి ప్రాంతాన్ని విడగొట్టాలనే ఆయన ప్రయత్నాలు మంచివి కావని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఆయన నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో మార్చాలనుకుంటున్నారని, అశాంతి రేపాలని భావిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. యువతను ఆత్మాహుతి వైపు నడిపేలా ఆయన చర్యలున్నాయన్నారు. ఈ విషయాలపై తగిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించామని కూడా తుషార్ మెహతా గుర్తు చేశారు. సోనమ్ వాంగ్ చుక్ను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద గత ఏడాది సెప్టెంబర్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు రాజస్థాన్, జోధ్పూర్లోని సెంట్రల్ జైలులో ఉన్నారు.