అహ్మదాబాద్, జూన్ 29: దేవకీ బెన్ వయస్సు 75 ఏండ్లు. తీవ్ర జ్వరం వచ్చింది. దవాఖానకు వెళ్లాలి. కానీ, ఆమె ఉంటున్న ఊరికి రోడ్డు లేదు. వాహనం వచ్చే పరిస్థితి లేదు. ఊరికి ఆవల ఉన్న మెయిన్ రోడ్డు దాకా వెళ్లాలంటే 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. దేవకీ కుమారుడు ధీరజ్ ఆమెను ఓ బెడ్ షీట్లో పడుకోబెట్టాడు. బెడ్ షీట్ రెండు చివరలను ఓ పొడుగాటి కర్రకు కట్టాడు. స్థానికుల సాయంతో కర్రను భుజాలపై మోస్తూ మెయిన్ రోడ్డు దాకా వెళ్లాడు. అక్కడి నుంచి వాహనంలో దవాఖానకు తరలించాడు. ఇదంతా జరిగింది ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో. 182 మీటర్ల ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం నిర్మించిన కేవడియాకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్వాని గ్రామం లో. తల్లిని బెడ్ షీట్లో మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.