భువనేశ్వర్ : కొవిడ్-19తో మరణించిన తల్లిని కడసారి చూసేందుకు కొడుకును స్మశాన వాటిక సిబ్బంది ఒకరు రూ 5000 డిమాండ్ చేసిన ఘటన ఒడిషాలోని కెంజిహార్ జిల్లాలో వెలుగుచూసింది. కరోనా సెకండ్ వేవ్ లో కొవిడ్ మృతదేహాలతో స్మశానాలు నిండిపోయిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ ముఖాన్ని కుమారుడికి చూపేందుకు సిబ్బంది రూ 5000 డిమాండ్ చేయడం వీడియోలో కనిపించింది.
రూ 5000 ఇస్తే ముఖాన్ని చూపుతా లేకుంటే పీపీఈ కిట్ లో ప్యాక్ చేసిన మృతదేహానికి అలాగే అంత్యక్రియలు నిర్వహిస్తా అంటూ సిబ్బంది మృతురాలి కొడుకుతో గట్టిగా చెబుతుండటం వైరల్ వీడియోలో వినిపించింది. ఈ వ్యవహారాన్ని మహిళ కుమారుడు మొబైల్ ఫోన్ లో రికార్డు చేస్తుండగా ఉద్యోగి వారించాడు. తాను వీడియోను రికార్డు చేయడంతో పాటు ఇంటర్ నెట్ లో అప్ లోడ్ చేస్తానని తనను జైలు పంపినా పట్టించుకోనని మృతురాలి కొడుకు తేల్చిచెప్పాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో స్ధానికులు లంచం అడిగిన ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తమ నోటీసుకు వచ్చిందని, ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఆశిష్ ఠాక్రే వెల్లడించారు.