అయోధ్య: ఈ భూమ్మీద తనకంటే అదృష్టవంతుడు ఎవరూ లేరని రామ్లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ అమితానందం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని చెక్కేందుకు ఆ రాముడే తనను ఎంపిక చేసుకొన్నాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కర్ణాటకలోని మైసూర్కు చెందిన శిల్పి యోగిరాజ్ మలచిన విగ్రహాన్నే అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు హాజరైన ఆయన సోమవారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కష్ట సమయాల్లో తనను, తన కుటుంబాన్ని రాముడే కాపాడుతుంటాడని తాను ఎల్లప్పుడూ అనుకొంటానని పేర్కొన్నారు. ‘బాలరాముడి విగ్రహాన్ని అందగా, కచ్చితత్వంతో చెక్కేందుకు తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ రోజున తాను మలచిన విగ్రహం అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠాపన అయింది. ఈ రోజు నా జీవితంలో అత్యంత గొప్ప రోజు’ అని యోగిరాజ్ ఆనందం వ్యక్తంచేశారు.