న్యూఢిల్లీ: కరోనా వైరస్ మానవుడి దైనందిన జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఈ మహమ్మారి నేర్పిన పాఠాలతో ప్రజలు ఆర్థిక, ఇతర అంశాల్లో పటిష్టమైన భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొంటున్నట్టు తాజా సర్వేలో తేలింది. కరోనా అనంతర ప్రపంచంలో బలమైన, స్థిరమైన వృద్ధికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని.. భవిష్యత్తులో ఎదురయ్యే ఆకస్మిక పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవడం కోసం సంపద నిర్వహణ వ్యూహాన్ని వేగవంతం చేశామని 84 శాతానికి పైగా మిలీనియల్స్ చెబుతున్నారు. క్యాషే ప్లాట్ఫాంపై దేశవ్యాప్తంగా 30 వేల మందిపై ఈ సర్వే జరిగింది. కొవిడ్ ప్రభావం కారణంగా ఆరోగ్యం, ప్రయాణం, షాపింగ్, సేవింగ్స్, క్రెడిట్ వంటి విషయాల్లో వచ్చిన ప్రాధాన్యతలను ఇక్కడ పంచుకున్నారు. కరోనా నేపథ్యంలో మెజార్టీ మిలీనియల్స్ ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. అదేవిధంగా పొదుపు, ఆరోగ్య బీమాలపై కూడా వారి అవగాహనలో పురోగతిని నివేదిక ప్రముఖంగా పేర్కొంది. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నామని, పొదుపును కూడా పెంచుకుంటున్నామని 52 శాతం మంది యువతీ యువకులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటామని, సమగ్రమైన ఆరోగ్య, జీవిత బీమా ప్లాన్లను కొనుగోలు చేశామని 35 శాతం మంది పేర్కొన్నారు. మిగిలిన 13 శాతం మంది విస్తృతమైన పెట్టుబడి కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కరోనా సంక్షోభంలో మరింత ఆరోగ్య స్పృహను పెంచుకున్నామని 71 శాతం మంది మిలీనియల్స్ పేర్కొన్నారు.