లద్ధాఖ్, ఆగస్టు 19: జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు. కారు గ్యారిసన్ నుంచి ఖేరికి 10 మంది జవాన్లతో వెళ్తున్న ఈ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ అధికారి సహా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు వాహనాలతో కూడిన ఆర్మీ కాన్వాయ్ ఖేరికి వెళ్తుండగా వాటిలో ఓ వాహనం ప్రమాదానికి గురైన్నట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబాలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ప్రమాదంలో జవాన్లను కోల్పోవడం ఎంతో బాధాకరం. దేశానికి వారు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. మృతుల కుటుంబ సభ్యుల చుట్టే నా ఆలోచనలు సాగుతున్నాయి. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.