శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో సెలవులపై ఇంటికి వచ్చిన ఓ సైనికుడు (Soldier) అదృష్యమయ్యాడు. అతని జాడకోసం కుటుంబీకులు వెతకగా.. జవాన్ కారులో వారికి రక్తపు మరకలు, చెప్పులు కనిపించాయి. ఎవరో తమ కుమారుడిని ఎత్తుకువెళ్లారని పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.
కుల్గామ్ (Kulgam) జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల జావేద్ అహ్మద్ వానీ (Javed Ahmad Wani) ఇండియన్ ఆర్మీలో (Indian Army) సైనికుడిగా లడఖ్లోని (Ladakh) లేహ్లో విధులు నిర్వహిస్తున్నారు. సెలవులపై ఇంటికి వచ్చిన అతడు.. శనివారం తన కారులో నిత్యావసరాలు కొనుగోలుచేయడానికి చొవల్గామ్ వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పరన్హాల్ సమీపంలో అతని కారును గుర్తించారు. కారుకు లాక్ వేయకపోగా.. అందులో జావేద్ చెప్పులు, సీటుపై రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అతని జాడకోసం ఆర్మీ, పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుని జల్లడపడుతున్నారు.