Internet Apocalypse | న్యూఢిల్లీ, జూలై 12: మరో రెండేండ్లలో ఇంటర్నెట్ కుప్పకూలిపోనుందా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతున్నది. 2025 నాటికి సూర్యుడు ‘సోలార్ మ్యాగ్జిమమ్’కు చేరుకుంటాడు. ఆ సమయంలో సౌర తుఫానులు భూమిని బలంగా తాకుతాయని, అప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం కావడం ఖాయమన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది. ‘సోలార్ మ్యాగ్జిమమ్’కు డిజిటల్ ప్రపంచం సిద్ధం కాకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ పేరుతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చ జోరందుకుంది. సౌర తుఫాను కారణంగా ఇంటర్నెట్ వ్యవస్థ అంతమైపోతుందన్న సోషల్ మీడియా చర్చపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, నెటిజన్లు మాత్రం ఈ చర్చలో బిజీగా గడిపేస్తున్నారు. నిజానికి అంత బలమైన సౌర తుఫాను ఇప్పటి వరకు భూమిని తాకలేదు. అయితే, 1859లో సంభవించిన ‘క్యారింగ్టన్ ఈవెంట్’ మాత్రం పెను నష్టాన్నే కలిగించింది.
సోలార్ సైకిల్లో భాగంగా సంభవించిన ఈ సౌర తుఫాను చరిత్రలో నిలిచిపోయింది. దీని కారణంగా టెలిగ్రాఫ్ లైన్స్ తెగిపోయాయి. పలువురు ఆపరేటర్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆ తర్వాత 1989లో సంభవించిన సౌర తుఫాను కారణంగా క్యుబెక్ గ్రిడ్ కొన్ని గంటలపాటు కుప్పకూలింది. ఇలాంటి విపరీత ఘటనలను ఇప్పటి వరకు చూడలేదని, మరి మన మౌలిక సదుపాయాలు దీనికి ఎలా ప్రతిస్పందిస్తాయో చూడాలని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంగీత అబ్దు జ్యోతి తెలిపారు. ఆమె పేపర్ ‘సోలార్ సూపర్స్టార్మ్: ప్లానింగ్ ఫర్ యాన్ ఇంటర్నెట్ అపోకలిప్స్’ కారణంగా ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ పదం ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. తీవ్ర సౌర తుఫాను సముద్ర గర్భంలోని కమ్యూనికేషన్ కేబుళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల కనెక్టివిటీ దెబ్బతినవచ్చునని జ్యోతి అభిప్రాయపడ్డారు. ఇటువంటి వాటి వల్ల ఒక్క రోజులోనే జరిగే నష్టం కూడా 11 బిలియన్ డాలర్ల పైనే ఉండే అవకాశం ఉంది.