Sonam Wangchuk | కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లడఖ్లో పరిస్థితులు ఏం బాగో లేవని సామాజిక సంస్కరణవాది సోనమ్ వాంగ్చుక్ విచారం వ్యక్తం చేశారు. ఇక్కడి హిమనీ నదాలు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ ఇక్కడి వాతావరణ పరిస్థితులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచిస్తు్న్నారు. సోనమ్ వాంగ్చుక్ జీవిత కథ స్ఫూర్తి ఆధారంగా బాలీవుడ్ సినిమా 3 ఈడియట్స్ నిర్మించారు.
లడఖ్లో పరిస్థితులు విషమంగా మారుతుండటాన్ని ఆయన తన 3 నిమిషాల నిడివి గల వీడియోలో స్పష్టం చేశారు. ఇక్కడి జీవనదులు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నందున లడఖ్ భద్రత, రక్షణకు ప్రధాని మోదీ భరోసా ఇవ్వాలని సోనమ్ మాంగ్చుక్ కోరారు. రానున్న రోజుల్లో ఇక్కడి పరిశ్రమల నుంచి వెదజల్లుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోని పక్షంలో లడఖ్లో పర్యాటకం, వాణిజ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పరిశ్రమలు పెరిగిపోవడం వల్ల రానున్న రోజుల్లో నీటి కొరత వంటి సమస్యలు కూడా వస్తాయన్నారు. హైవేల నిర్మాణాలు, ఇతర మానవ కార్యకలాపాలతో హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని కశ్మీర్ విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనం సూచించిందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా, యూరప్ కారణంగానే గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు వస్తున్నాయని అనుకోవద్దని, స్థానిక కాలుష్యం, కర్బన ఉద్గారాలు సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని వాంగ్చుక్ చెప్పారు. స్థిరమైన అభివృద్ధిని అవలంబింల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ.. లడఖ్ తో పాటు ఇతర హిమాలయ ప్రాంతాలను పారిశ్రామిక దోపిడీ నుంచి రక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఇది ముమ్మాటికీ ఇక్కడి ప్రజల జీవితాలను, ఉపాధిని కాపాడటానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.