ప్రజాస్వామ్య భారతంలో వెనుకబడిన తరగతులకు తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడే సామాజిక న్యాయం అనే మాటకు సంపూర్ణత చేకూరుతుంది. ఇది సాకారం కావాలంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కులాలవారీ జనగణన ఒక్కటే పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలకతీతంగా పలువురు రాజకీయ నేతలు కూడా కులగణనకు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మోదీ ప్రభుత్వం ‘కులగణన’ చేపట్టడానికి విముఖత వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో.. అసలు కులగణన ఎందుకు? దీంతో లాభాలేంటి? బీజేపీ ఎందుకు దీనిపై వెనుకడుగు వేస్తున్నది? తదితర అంశాలపై సమగ్ర కథనం..
పదేండ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా.. అందులో దళితులు, ఆదివాసీల సంఖ్యపైన మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే, జనాభాలో ఓబీసీతో పాటు ఏయే కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఉద్దేశించినదే కులగణన.
ఇంతకు ముందు ‘కులగణన’ చేపట్టలేదా?
బ్రిటీష్ వలస ప్రభుత్వ పాలనలో 1931 జనగణనతో పాటు ఇతర సమాచారం ఆధారంగా దేశంలో 52 శాతం ఓబీసీ జనాభా ఉన్నట్టు మండల్ కమిషన్ నిర్ధారించింది. ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్ చేసిన సిఫార్సులను 60 ఏండ్ల తర్వాత అంటే 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. దీంతో అప్పటివరకూ అగ్రవర్ణాలతో కలిసి జనరల్ కేటగిరీలో ఉంటూ సామాజిక అన్యాయానికి గురైన ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే, జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు లభిస్తున్న రిజర్వేషన్ చాలా తక్కువనేనన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో 2011లో సామాజిక-ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ)ను చేపట్టారు. దేశంలోని 46 లక్షల కులాలు, ఉప కులాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వివరాలను ఇప్పటివరకూ బయటపెట్టలేదు.
కులగణన చేపట్టాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తం అవుతుండటంతో దీనిపై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. గతవారం ఈ అంశంపై ప్రమాణ పత్రాన్ని సమర్పించిన కేంద్రం.. కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని కోర్టుకు తెలిపింది.
కులగణన అవసరమేంటి?
విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. 1931 నాటి పరిస్థితులకు అనుగుణంగా మండల్ కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ కోటాను ఇప్పటికీ పాటిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో వెనుకబడిన వర్గాల జనాభా బాగా పెరిగిపోయింది. అయినప్పటికీ, వారి జనాభాకు తగిన ప్రాతినిధ్యం (రిజర్వేషన్లు) కల్పించడంలేదన్నది నిపుణుల వాదన. దీంతో ఓబీసీలు సామాజిక అన్యాయానికి గురవుతున్నారు. దేశంలోని సగం కంటే ఎక్కువ జనాభా ఓబీసీలేనని పలు ఎన్జీవోలు చేపట్టిన నివేదికల్లో వెల్లడైంది. దీని ప్రకారం.. 50 శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు కల్పించాలి. ఇది జరుగాలంటే దేశంలో కులగణన చేపట్టాలి. అప్పుడే, ఏ వెనుకబడిన వర్గానికి ఎంత రిజర్వేషన్ కేటాయించాలన్న దానిపై స్పష్టత వస్తుంది. మరోవైపు, రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతం మించకూడదన్న నిబంధనను కూడా సవరించాల్సి ఉంటుంది.