Smriti Irani-Rahul Gandhi | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోమవారం నుంచి నాలుగు రోజులు తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జోడో న్యాయ్ యాత్ర అమేథీలో ప్రవేశిస్తున్న రోజే స్మృతి ఇరానీ పర్యటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ లోక్సభా స్థానంలో ఓటమి పాలయ్యే వరకూ 15 ఏండ్ల పాటు అమేథీ లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఇద్దరు నేతలు అమేథీలో ఒకేసారి పర్యటిస్తుండటం ఇది రెండోసారి. ఇంతకు ముందు స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ.. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2022 ఫిబ్రవరిలో అమేథీలో పర్యటించారు.
ఈ నెల 22న అమేథీలో గృహ ప్రవేశంతోపాటు పలు గ్రామాల ప్రజలతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖాముఖీ సమావేశం అవుతారని ఆమె అధికార ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపారు. గత లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే అమేథీలో సొంత ఇల్లు నిర్మించుకుంటానని హామీ ఇచ్చారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అమేథీలో పర్యటించనున్న రాహుల్ గాంధీ, రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం ఇరువురు నేతలు ముఖాముఖీ ఎదురుపడే అవకాశాలు తక్కువ అని ఆ వర్గాల కథనం.