న్యూఢిల్లీ, డిసెంబర్ 14: మహిళా ఉద్యోగుల నెలసరి దినాలు వేతనంతో కూడిన సెలవుగా ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ వ్యతిరేకించారు. రాజ్యసభలో బుధవారం ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ మహిళల్లో నెలసరి అనేది జీవన గమనంలో సహజంగా జరిగే ఒక ప్రక్రియ అని, దానికి వైకల్యంగా భావించి సెలవు వంటి సౌకర్యం కల్పించలేమని అన్నారు.
అంతేకాకుండా ఈ నెలసరి సెలవు వల్ల మహిళల పనిప్రదేశంలో వివక్షకు దారితీసే అవకాశం కూడా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే నెలసరి సమయంలో శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని అంగీకరించిన ఆమె, దీనిపై ఆరోగ్య శాఖ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు. నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. నెలసరి కాలాన్ని మహిళలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలన్న ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద పరిశీలనలో లేదని మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు.