న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి లేఖ రాశారు. ఇటీవల తాను రాష్ట్రపతికి బదులుగా రాష్ట్రపత్ని అని వ్యాఖ్యానించినందుకు బీజేపీ ఎంపీలు హంగామా సృష్టించారని చౌదరి పేర్కొన్నారు.
అదే సమయంలో లోక్సభలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పట్ల అగౌరవంగా ప్రవర్తించారని తెలిపారు. ఆమె పదేపదే ద్రౌపది ముర్ము అని సంబోధించారు తప్ప.. రాష్ట్రపతి ముర్ము లేదా మేడం ముర్ము అని వ్యాఖ్యానించలేదు. ఈ క్రమంలో రాష్ట్రపతిని అగౌరవపరిచిన స్మృతి ఇరానీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రపత్నిగా వ్యాఖ్యానించిన అధిర్.. రాతపూర్వకంగా రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.