న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటి స్మోగ్ టవర్ (Smog Tower) అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ స్మోగ్ టవర్ను సోమవారం ఉదయం ప్రారంభించారు.
ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నివారించడంలో ఈ టవర్ ముఖ్య పాత్ర పోషించనున్నది. పైలట్ ప్రాజెక్టుగా గత ఏడాది అక్టోబర్ నెలలో దీనిని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీని పనులు నిలిచిపోయాయి. రెండేండ్ల పాటు దీని పనితీరుపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం మిగతా ప్రాంతాల్లో కూడా ఈ టవర్లను నెలకొల్పుతారు.
దేశంలోని మొట్టమొదటి స్మోగ్ టవర్ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో నెలకొల్పారు. దీనిని ప్రారంభించిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. వాయు కాలుష్యంపై పోరాడటానికి, ఢిల్లీ గాలిని శుభ్రం చేయడానికి దేశంలోని మొట్టమొదటి స్మోగ్ టవర్ ఢిల్లీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టెక్నాలజీని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ టవర్ 24 మీటర్ల ఎత్తులో ఉండి.. 1 కిలోమీటర్ల వ్యాసార్థంలోని గాలిని శుభ్రపరుస్తుంది. ఈ పొగమంచు టవర్ కలుషితమైన గాలిని లోపలికి తీసుకుని స్వచ్ఛమైన గాలిని 10 మీటర్ల ఎత్తులో విడుదల చేస్తుంది. ఈ టవర్ ప్రతి సెకనుకు 1000 క్యూబిక్ మీటర్ల గాలిని శుభ్రపరుస్తుంది.దీనిని ప్రారంభించిన తర్వాత నిపుణులు ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాని ప్రభావాన్ని తెలుసుకుంటారు. ఫలితాల ఆధారంగా, ఢిల్లీలోని ఇతర ప్రదేశాల్లో ఈ పరికరాలను ఇన్స్టాల్ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ విహార్ వద్ద స్మోగ్ టవర్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గత ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో 3 నెలల్లో కన్నాట్ ప్లేస్లో టవర్ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు కన్నాట్ ప్లేస్ స్మోగ్ టవర్ను ఏర్పాటు చేశారు.
హాల్మార్క్ ఐడీకి వ్యతిరేకంగా బంగారు దుకాణాల మూసివేత
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
ల్యాబ్లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..