Delhi smog | దేశ రాజధానిని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ నగరం మొత్తం పొగతో కప్పబడి ఉన్నది. దీపావళికి ఒక రోజు ముందు గాలి నాణ్యత చాలా ఘోరంగా తయారైంది. పగటి పూటనే రోడ్లపై వాహనాలు కనిపించని పరిస్థితి ఎదురైంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్తో వాతావరణం ఎంత అధ్వానంగా తయారవుతుందో అని పర్యవారణవేత్తలు భయపడుతున్నారు.
రాజధానిలో పొగమంచు వాతావరణం నెలకొన్నది. తూర్పు ఢిల్లీలో కూడా వాతావరణం పరిస్థితి దిగజారింది. గాలి నాణ్యత సరిగా లేకపోవడంతో అక్షరధామ్ ఆలయం సమీపంలోని ప్రాంతాలన్నీ పొగమంచుతో నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఉదయం 6.30 గంటలకు గాలి నాణ్యత (ఏక్యూఐ) 251 గా నమోదైందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) నివేదించింది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా నమోదవుతున్నది. శనివారం ఏక్యూఐ 266గా నమోదైంది. ఢిల్లీ యూనివర్శిటీ పరిసరాల్లో గాలి నాణ్యత 327గా ఉన్నది.
వాయు కాలుష్య నియంత్రణకు 15 పాయింట్లతో శీతాకాల కార్యాచరణ రూపొందించినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఈ పథకం కింద దుమ్ము, కాలుష్యం, చెత్త నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, క్రాకర్స్ వంటి సమస్యలపై చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఢిల్లీలో 39 శాతం వాయు కాలుష్యం స్థానికంగా ఉత్పన్నమవుతుండగా.. పొరుగు ప్రాంతాల నుంచి కూడా కాలుష్యం నగరంపై ప్రభావం చూపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.