న్యూఢిల్లీ : సాగు చట్టాల రద్దు కోరుతూ చేపట్టిన ఆందోళనలో మరణించిన రైతు కటుంబాలకు పరిహారం, ఎంఎస్పీ సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. రైతు సంఘాల తరపున ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతంది. ఈ కమిటీలో యుధవీర్ సింగ్ (యూపీ), శివకుమార్ కక్కా (ఎంపీ), బల్బీర్ రజేవాల్ (పంజాబ్), అశోక్ ధవలే (మహారాష్ట్ర), గుర్నాం సింగ్ చధౌని (హర్యానా) సభ్యులుగా ఉంటారు.
ఎస్కేఎం డిసెంబర్ 7న సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని కమిటీ సభ్యుడు, ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధవలే వెల్లడించారు. రైతు నేతలను విడివిడిగా కేంద్రం సంప్రదిస్తూ రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఎస్కేఎం ఆరోపించింది. సాగు చట్టాల రద్దును కోరుతూ చేపట్టిన ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని పలు డిమాండ్లను రైతు సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి.మరోవైపు రైతు ఉద్యమంలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విపక్షాలు మోదీ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నాయి.